ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి ఇవాళ బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆదినారాయణ రెడ్డికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదినారాయణ రెడ్డి 2014లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ఆదినారాయణ రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని ఊహాగానాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలతోపాటు టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.