రాష్ట్రం లో రివర్స్ టెండరింగ్ పేరుతో రియాలిటీ షో నడుస్తుందని తెలుగుదేశం నేత,మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో పోలవరంలో 73 వేల 622 కోట్ల రూపాయల పనులు జరిగిన విషయాన్ని పక్కకు పెట్టి నాలుగు నెలల పాలన గురించి వైసిపి నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేసారు. ఇంతవరకు పోలవరం ప్రోజక్టులో ఒక బొచ్చెడు సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి ఎత్తలేదని, పోలవరం ప్రాజెక్ట్ పనులన్నీ హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాయన్నారు. ఈ నాలుగున్నర నెలల్లో పెండింగ్ బిల్స్ ఎవరెవరికి ఇచ్చారో చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు చేయటానికే సరిపోతుందని, అసలు ఆయన ఎందుకు ఢిల్లీ పదే పదే వెళ్తున్నారో మీడియా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం జగన్కి లేదని వ్యాఖ్యానించారు. రైతు భరోసా పధకం కింద వచ్చే డబ్బులు రైతుల అకౌంట్ లో జమ కావటం లేదని, డబ్బులు పడనప్పుడు మళ్ళీ మెసేజ్ లు ఎందుకు పంపిస్తున్నారని నిలదీసారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇసక కొరతతో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పడుతున్న బాధలు వర్ణనాతీతమని, అయినా మంత్రులు, వైసిపి నేతల కనుసన్నల్లో వేలాది ఇసుక లారీలు హైద్రాబాద్,బెంగళూరు వెళ్తున్నాపట్టించుకునే నాధుడు లేడన్నారు. తాజాగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో రాత్రి 8 తరువాత వైసీపీ కార్యకర్తలు లిక్కర్ అమ్ముతున్నారని వార్తలొస్తున్నాయని, ఇవన్నీ మాట్లాడకుండా ఉండాలనే జీవో నెంబర్ 938 తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు దేవినేని ఉమ