ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా నేటికీ పెండింగ్ బిల్లులు చెల్లించలేని చేతకాని ప్రభుత్వమంటూ ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ ఇంట్లో కూర్చుని డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. పెండింగ్ బిల్లులు అలానే ఉన్నాయని, నేటికీ ఎవరికీ బిల్లులు చెల్లించలేదన్నారు.గోదావరిలో బోటు మునిగి నెలన్నర అయితే రాష్ట్రం మునిగి నాలుగున్నర నెలలు అవుతోందని ఉమా విమర్శలు గుప్పించారు. బోటు మునిగి ఇన్ని నెలలైతే సీఎం జగన్ చేతకానితనం.. అసమర్థత వల్లే ఇంకా బయటకు తీయలేకపోయారని వ్యాఖ్యానించారు. గోదావరి గర్భంలో మూడొందల అడుగుల లోతున ఉన్న కొండను తవ్వి కిలోమీటర్ మేర డయాఫ్రం వాల్ కట్టామన్నారు. చేతకాని ప్రభుత్వం బోటు బయటకు తీయలేకపోయిందని విమర్శించారు.ఆప్తులను పోగొట్టుకున్న బాధితులు ప్రమాదం జరిగిన కచ్చులూరు పరిసరాలకు వెళ్లకుండా గోదావరి నదిపై 144 సెక్షన్ పెట్టిన గొప్ప నేత జగన్ అని ఉమా ఎద్దేవా చేశారు. సీఎం ఇంటి వద్ద కూడా ఎప్పుడూ నిషేధాజ్ఞలు అమల్లో ఉండడం ఇక్కడే చూశామన్నారు. సీఎం రేపు ఢిల్లీ వెళ్తున్నారని, అక్కడికి వెళ్లి ఏం మాట్లాడారో ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. సీబీఐ కేసుల గురించి మాట్లాడడానికే వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.రైతుభరోసా, మద్య నిషేధం అమలుపై దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. రాత్రి మద్యం షాపులు మూతపడిన తరువాత వైఎస్సార్సీపీ నేతలు మద్యం విక్రయాలు చేస్తున్నారన్నారు. రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బులు పడకుండానే మెసేజ్లు పంపుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ శాఖకు భలే మంత్రిని పెట్టారంటూ సెటైర్లు వేశారు.