తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్, నీలగిరి, దిండిగల్, కన్యాకుమారి జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో 10 జిల్లాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. భారీ వర్షాలతో కోయంబత్తూర్, తిరువళ్లూరు జలమయం అయ్యాయి. అదేవిధంగా చెన్నై, తిరునలివేలి, ఊటీతోపాటు మరికొన్ని జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్ లో జనజీవనం అస్తవ్యస్తమైంది.
వరదకు గంధయూరు వంతెన పూర్తిగా మునిగిపోయింది. భవాని సాగర్ డ్యామ్ పూర్తిస్థాయిలో నిండటంతో నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో నది పరివాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి. గంధయూరు, పులియూర్, గంధవాయిల్, ఆలూరు గ్రామాలు నీట మునిగాయి. గ్రామస్తులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలతో పంట నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో అరటి తోటలు నీట మునిగాయి.