రాష్ట్రంలో దాదాపు 40 లక్షల రైతుల కుటుంబాలకు ఇవాళ సహాయం అందుతోందని, కాసేపట్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని సీఎం వైఎస్.జగన్ అన్నారు. మిగిలిన 14 లక్షల రైతుల కుటుంబాలకు కూడా ‘వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ పథకంలో సహాయం అందుతుంది. అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతా అప్డేట్ చేస్తూ ప్రతి బుధవారం నాడు, రైతు భరోసా కింద సహాయం చేస్తామన్నారు. నవంబరు 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఎవరైనా మిగిలిపోతే గ్రామ సచివాలయాలు, ఎమ్మార్వో ఆఫీస్, కలెక్టరేట్ లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరో రెండు రోజుల్లో సంబంధిత వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నామని తెలిపారు. నెల్లూరులో ‘వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ పథకం ప్రారంభోత్సవంలో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు.
రైతు బిడ్డగా నెల్లూరు వచ్చాను. ప్రతి రైతు చరిత్ర మార్చే గొప్ప పథకానికి ఇవాళ నాంది పలుకుతున్నామని జగన్ తెలిపారు. 2014 తర్వాత రాష్ట్రంలోని రైతులు చాలా నష్టపోయారు. ఆ పరిస్థితి మనమంతా చూశాం. 2017, జూలై 8న మహానేత వైఎస్సార్ జయంతి రోజు మంగళగిరిలో పార్టీ ప్లీనరీ జరిగింది. ఆరోజు రైతులకు ఒక మాట చెప్పాను. 5 ఎకరాల లోపు ఉన్న రైతులు, చిన్న, సన్నకారు రైతులకు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.50 వేలు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నాను. ఏటా రూ.12,500 ఒకేసారి ఈ మొత్తం మే నెలలో ఇస్తాము. సాగు పెట్టుబడిగా ఆ సహాయం చేస్తాము. ఆ మొత్తం బ్యాంకులు రుణానికి జమ చేసుకోకుండా చర్యలు చేపడతామన్నారు.
వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్ పంట వేసే సమయంలో మే నెలలో రూ.7500, అక్టోబరులో రబీ అవసరాలు తీరేలా రూ.4 వేలు, ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి పండగ వేళ మరో రూ.2 వేలు ఇవ్వబోతున్నామని వివరించారు. గతంలో చెప్పినట్లు రూ.12,500 కంటే ఎక్కువ రూ.13,500 ఇవ్వబోతున్నాము. ఆ సహాయం కూడా నాలుగేళ్లకు కాకుండా 5 ఏళ్లు ఇవ్వబోతున్నామని జగన్ చెప్పారు. ఆ విధంగా ప్రతి రైతు కుటుంబానికి రూ.67,500 ఇవ్వబోతున్నాము. గత ప్రభుత్వం సాధికార సర్వే ద్వారా 43 లక్షల రైతులను గుర్తించగా, ఈ ప్రభుత్వం పక్కా సర్వేతో 51 లక్షల రైతు కుటుంబాలను గుర్తించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో భూమి లేని నిరుపేదలైన కౌలు రైతులు 3 లక్షల మందికి కూడా ఈ పథకంలో సహాయం చేస్తున్నామన్నారు. ఆ విధంగా మొత్తం 54 లక్షల రైతుల కుటుంబాలకు మేలు చేయబోతున్నాము. పంటల బీమా కోసం 55 లక్షల రైతుల తరపున 56 లక్షల హెక్టార్ల భూమికి సంబంధించి రూ.2164 కోట్లు ప్రీమియమ్గా చెల్లిస్తోంది. కౌలు రైతులకు కూడా భరోసా ఇచ్చే విధంగా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే చట్టం చేశాం. రూ.1.5 లక్షల లోపు రుణం తీసుకున్న రైతులకు సున్నా వడ్డీ రుణం అమలు చేస్తున్నాం. రైతులు బలవన్మరణానికి పాల్పడితే వారికి వెంటనే రూ.7 లక్షల సహాయం ఇస్తున్నాం. దాన్ని కలెక్టర్ స్వయంగా అందజేస్తున్నారు. గ్రామ సచివాలయం పక్కనే దుకాణం. అందులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతామని, ఈ ఏడాదిలోనే ఇది జరగబోతుందని సీఎం ప్రకటించారు.