తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు గత పది రోజులుగా చేస్తున్న సమ్మె ఉద్యమరూపం దాల్చేలా ఉన్న నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ తనదైన శైలిలో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ ఏపి సిఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్నిఆయన తప్పుపట్టారు. కేవలం ఓట్ల ప్రయోజనాల కోసం ఇటువంటి తాత్కాలిక నిర్ణయాలు తీసుకోవాటం వల్ల ఆర్టీసీలాంటి సంస్థలు తిరోగమనానికి కారణమవుతాయన్నారు.
నష్టాల్లో ఉన్న ఎపిఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించాలని ఏపి ప్రభుత్వం భావిచడంలేదో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. వ్యాపార సంస్థగా ఆర్టీసీలో పోటీ తత్వం పెంచాల్సి ఉండగా ఆదిశగా చర్చలు కూడా ఉండవని అన్నారు. డీజిల్ ధరలు పెరిగినా..కేవలం ప్రజల్లో రాజకీయ సానుకూలత కోసమే టిక్కెట్ ధరలు పెంచకుండా ఆర్టీసీని దివాలా తీయించడం ద్వారా నష్టం చేస్తున్నారన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు దీర్ఘ కాలికంగా మంచిది కాదని, ఆర్టీ ఆస్తులు ప్రభుత్వంలో కలగలిసి ఇష్టాను సారంగా ఇతరులకు ధారాదత్తం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని జేపీ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఆర్టీసీ సిబ్బంది వేతనాలు ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయని హెచ్చరించారు. అదే సమయంలో ఆర్టీసీపై కేసీఆర్ ఆలోచనలతో జేపీ ఏకీభవించారు.