15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆరంభించనున్న వైఎస్ఆర్ రైతు భరోసాకు .. వైఎస్ఆర్ రైతు మోసం అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం ఏలూరులోని తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రైతులందరికీ భరోసా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ కేంద్రం ఇచ్చే ఆరువేలతో కలిపి ఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదని గుర్తు చేసారు. తాము ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు ప్రభుత్వం నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు 15 లక్షల పైచిలుకు ఉన్నారని, వారిలో కేవలం 40వేల మంది లబ్ధిదారులను మాత్రమే . రైతు భరోసా పథకానికి ఎంపిక చేయడం రైతాంగాన్ని మోసం చేయటం కాదా? అని నిలదీసారాయన. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 194 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, వారి కుటుంబాలను పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. రైతు రుణమాఫీని యధావిదిగా కొనసాగించాలని కేంద్రం ఇస్తున్న రాయితీతో కలిపి రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.18,500 ఇవ్వాలని ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు.