ఏపీలో తర్వలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 50 మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది జగన్ ప్రభుత్వ యోచన గా కనిపిస్తోంది. కొత్త మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ డైరెక్టర్ విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ కు రాసిన లేఖలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేయవలసిందిగా కూడా విజయకుమార్ అన్యాపదేశంగా అన్ని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఏడాది జులై మొదటి వారంలో మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. వెనువెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కొద్ది కాలం వాయిదా వేసింది. కానీ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. కాబట్టి త్వరలోనే ఎన్నికలు నిర్వహించడం అనివార్యం. అలాగే పంచాయతీ, జడ్పీటిసి,ఎంపిటిసి ఎన్నికలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆరు నెలల పాటు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశాక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ప్రభుత్వవ్యూహం.ఏ లెక్కన చూసినా డిసెంబర్ లోనో,జనవరిలోనో ఈ ఎన్నికలు నిర్వహించక తప్పదు. అయితే ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు అధికార వర్గాల బోగట్టా.అందుకు సంబంధించి శరవేగంతో ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి .ఇప్పటికే వార్డుల విభజన రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిందని వారు చెప్పారు.ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆ వర్గాలు చెప్పాయి.కాబట్టి త్వరలోనే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్నది.