గత ఎన్నికలలో చెరో పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇక కలసి ఒకే పార్టీలో సాగనున్నారా? అంటే అవుననే చెపుతున్నాయి వైసిపి వర్గాలు. పురందేశ్వరి బీజేపీలో కొనసాగుతుండగా ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రెండు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్న దంపతులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరిలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఎన్నికలకు ముందు భార్యాభర్తలు చెరో పార్టీలో కొనసాగేందుకు అభ్యంతరం చెప్పని వైసీపీ, కొద్ది కాలంగా బీజేపీ ఏపీలో జగన్ సర్కారును టార్గెట్ చేసి విమర్శలు చేస్తుండటాన్ని భరించలేకపోతోంది. ఆ క్రమంలోనే పురంధేశ్వరి కూడా వైసీపీ ప్రభుత్వంపైన, జగన్ పైన విరుచుకు పడుతుండటంతో మీరు ఇక్కడ ఉండి, ఆమెతో అక్కడ నుంచి విమర్శలు సరికాదు. పురందేశ్వరితో బీజేపీకి రాజీనామా చేయించి,వైసిపిలోకి తీసుకురావాలని దగ్గుబాటిపై వైసిపి నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇదే విషయం ముఖ్యమంత్రి జగన్ దగ్గర కూడా ప్రస్తావించారని, పురందరేశ్వరి పార్టీలోకివస్తామంటే తీసుకుందామని, భర్తా భార్యలు ఒకే పార్టీలో ఉండటం మనకీ క్షేమదాయకమని వ్యాఖ్యానించినట్టు సమాచారం.
పురంధేశ్వరి మాత్రం పార్టీ మారేందుకు ససేమిరా అంటున్ననేపథ్యంలో వెంకటేశ్వరావే కాషాయకండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
ఇందుకు ప్రధాన కారణం గతంలో పరుచూరులో వైసీపీ ఇన్ చార్జ్ గా ఉండి, దగ్గుబాటి చేరిక తరువాత, టీడీపీలోకి వెళ్లిపోయిన రావి రామనాథం బాబు, ఎన్నికల తరువాత తిరిగి వైసీపీలో చేరారు. ఇప్పుడు దగ్గుబాటిని పక్కకు పెట్టి పార్టీ పనులన్నీ రావికే అప్పగిస్తుండటంతో పార్టీలో నామమాత్రపు గుర్తింపు కూడా తనకు లేకుండా పోయిందని వెంకటేశ్వరరావు సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పురందేశ్వరి కూడా భవిష్యత్లో తన పరిస్థితి అలాగే ఉంటుందని రాజకీయాలలో ఇవి కొత్త కాదని భర్తకు చెప్పినట్టు తెలుస్తోంది. తన భార్యతో పనిలేకుండా పార్టీలో కొనసాగాలని ఉన్నా, జగన్ ఒప్పుకుంటే సరేసరి లేదంటే తానే పార్టీని వీడాలని భావిస్తున్నట్టు దగ్గుబాటి అనుచరులు చెప్పుకొస్తున్నారు.