తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టామని టిటిడి గార్డెన్ విభాగం డెప్యూటీ డైరెక్టర్శ్రీ నివాసులు తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్లో ఆదివారం ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో దాదాపు 40 టన్నుల సాంప్రదాయ పుష్పాలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ , అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను జోడిస్తూ అలంకరణలు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలలో శ్రీవారి ఆలయం, తిరుమలలోని ప్రధాన కూడళ్ళలో 2 లక్షలు కట్ ఫ్లవర్స్, దాదాపు 50 వేలు సీజనల్ ఫ్లవర్స్ ఉపయోగించినట్లు వివరించారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా 2, 3, 7 రోజులలో రంగనాయక మండపంలో స్వామివారి స్నపన తిరుమంజనం సందర్భంగా ప్రత్యేక పుష్పాలంకరణలు చేశామన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేరుసనగ, చిక్కుడు గింజలు, జీడిప్పు, కలకండలతో కిరీటాలు, మాలలను రూపొందించి అలంకరించినట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 35 మంది దాతల సహకారంతో పుష్పాలంకరణలు చేస్తున్నట్లు తెలియజేశారు.
మహా ప్రదర్శనలో భాగంగా ముందుగా శ్రీమహావిష్ణువు గరుడినిపై వస్తున్న విధంగా రూపొందించిన సైకత శిల్పం ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా, కట్ ఫ్లవర్స్ తో ఏనుగు, గుర్రం రూపాలను, శ్రీవారి వైభవం, తలనీలాల సమర్పణలో విశిష్టత, హథీరాం బావాజీ చరిత్రను భక్తులకు తెలిసేలా రూపొందించామన్నారు. పుష్పాలంకరణ చేసేందుకు 250 మంది నిపుణులు సహకారం అందించారని తెలిపారు. తిరుమలలో జీఏన్సీ నుండి వైభవ మండపం వరకు పుష్పాలతో అలంకరణలు చేశామని చెప్పారు.
ఈ ఏడాది ప్రత్యేకంగా శ్రీ అత్తి వరదరాజస్వామివారి మూడు భంగిమల్లో సెట్టింగ్ ఏర్పాటు చేయడం, కంచికి వెళ్లి చూసిన అనుభూతి భక్తులకు కలుగుతుందన్నారు. అదేవిధంగా, నాలుగు యుగాలకు సంబంధించిన పౌరాణిక ఘట్టాలతో భక్తిభావాన్ని పంచేలా దేవతామూర్తులను రూపకల్పన చేశారని అన్నారు. ఫలపుష్పాలతో ఏర్పాటు చేసిన ఏనుగులు, కలశాలు, గుర్రాలు, రథం తదితర ఆకృతులను తిలకించారు.
అక్టోబరు 8న శ్రీవారి చక్రస్నానం నిర్వహించే శ్రీ వరహస్వామివారి ఆలయం వద్ద ఒక టన్ను సాంప్రదాయ పుష్పాలు, ఆస్ట్రేలియా ఆరెంజ్ లతో అలంకరణలు చేపట్టినట్లు తెలిపారు.