శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం మధులిక బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తాయి. ఇతర ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు హైదరాబాద్కు చెందిన భమిడిపాటి అన్నపూర్ణ మధులిక, టి.తేజోవతి బృందం అన్నమాచార్య సంకీర్తనలతో భక్తులను ఓలలాడించారు. ఇందులో బ్రహ్మమొక్కటే…, ఇట్టి ముద్దులాడి బాలుడు…, విదివో అల విజయరాఘవుడు…, ఆనంద నిలయ ప్రహ్లాదవరద…, ఇందరికీ అభయమ్మునిచ్చు చేయి…., వేడుకొందామా…, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు…., అళరుచంచలమైన ఆత్మలందుండ…. తదితర కీర్తనలు భక్తిభావాన్నిపంచాయి.
ముందుగా, నాదనీరాజనం వేదికపై ఉదయం 5 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి కె.రవిప్రభ బృందం మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ఆర్.వాణిశ్రీ బృందం విష్ణుసహస్రనామ పారాయణం, ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ అజయ్ ఆచార్య ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీమతి వసుమతి బృందం నామసంకీర్తన, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ వై.వేంకటేశ్వర్లు భాగవతార్ హరికథ వినిపించారు.
అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో శనివారం ఉదయం 11.30 నుండి 12.30 గంటల వరకు హైదరాబాద్కు చెందిన శ్రీమతి లక్ష్మీప్రసన్న బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.