ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు ఇకపై సెలవు దినాల్లో 50 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వాలని చెన్నై మెట్రో రైల్ యాజమాన్యం యోచిస్తున్నట్టు సమాచారం. చెన్నై మెట్రోలో రోజుకు సగటున 1.2 లక్షల మంది ప్రయాణిస్తుండగా... ఆదివారాలు, సెలవు దినాల్లో ఈ సంఖ్య అమాంతం 70 వేలకు పడిపోతోంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెట్రో యాజమాన్యం ఆదివారాలు, సెలవు దినాల్లో టికెట్ ధరపై 50 శాతం తగ్గింపును అమలు చేయాలని యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ డిస్కౌంట్ కొన్ని నెలల పాటు లేదా ఓ సంవత్సరం పాటు కొనసాగిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తుదిదశకు చేరుకోగా.. త్వరలోనే చెన్నై మెట్రో రైల్ బోర్డు ముందుకు చేరనున్నాయి.
కాగా ఈ ఏడాది మొదట్లో చెన్నై మెట్రో రైలు నెలవారీ పాసులను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పాస్ ద్వారా ప్రయాణికులు ఎన్నిసార్లైనా ప్రయాణించే సౌకర్యం కల్పించింది. ఈ పాసులను పొందడానికి ప్రయాణికులు రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా టూరిస్టు కార్డు కొనేందుకు రూ.50 రీఫండబుల్ ఫీజు కట్టాలి. 2017లో మెట్రో యాజమాన్యం ఓ వారం రోజుల పాటు 40 శాతం డిస్కౌంట్ అమలు చేయడంతో ప్రయాణికుల సంఖ్య 67 శాతం పెరిగింది. 2017 దీపావళి సందర్భంగా కూడా చెన్నై మెట్రో 20 శాతం డిస్కౌంట్ ఇచ్చింది.