ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రాలను పెంచండి : పుష్ప శ్రీవాణి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2019, 05:54 PM

అమరావతి, సెప్టెంబర్ 27:- గత ప్రభుత్వహయాంలో జీసీసీలో జరిగిన అక్రమాలన్నింటిమీదా విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అధికారులను ఆదేశించారు. అటవీ ఉత్పత్తుల విలువను పెంచే ప్రాసెసింగ్ కేంద్రాలను పెంచాలని, ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని కూడా ఆదేశాలను జారీ చేసారు.


రాష్ట్ర సచివాలయంలోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో శుక్రవారం గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జీసీసీ విసి ఎండి పి.ఎ. శోభ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జీసీసీలో పలు అక్రమాలు జరిగాయని, కోట్లాది రుపాయలు దుర్వినియోగమైయ్యాయని వస్తున్న ఆరోపణలపై సమగ్ర స్థాయిలో విచారణకు ఆదేశించారు. అక్రమాలు చేసి లక్షల రుపాయలు దుర్వినియోగం చేసిన వారిని బదిలీ చేయడంతోనో, సస్పెండ్ చేయడంతోనో సరిపెట్టకూడదని స్పష్టం చేసారు. లక్షలాది రుపాయలను దుర్వినియోగం చేసిన వారు ఆ డబ్బును వెనక్కి చెల్లించేస్తే చేసిన తప్పు ఒప్పయిపోతుందా..? అని ప్రశ్నించారు. అక్రమాలు జరిగాయంటూ చిరుద్యోగులపై చర్యలు తీసుకోవడం, కక్ష సాధించడం చేస్తూ, పెద్ద ఉద్యోగులను వదిలేయడం జరుగుతోందని కూడా తన దృష్టికి వచ్చిందని, ఇది ఏమాత్రం సమంజసం కాదని చెప్పారు. తప్పు చేసినట్లుగా తేలిన వారిపై తప్పనిసరిగా క్రిమినల్ కేసులు పెట్టాలని, దుర్వినియోగమైన డబ్బు మొత్తాన్ని ఖచ్చితంగా తిరిగిరాబట్టాలని పుష్ప శ్రీవాణి స్పష్టం చేసారు. ఈ విషయంగా తన దృష్టికి వచ్చిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ తప్పు చేసిన ఉద్యోగులను యధావిధిగా విధుల్లో కొనసాగించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసిన తప్పులకు రెగ్యులర్ ఉద్యోగులను బాధ్యులు చేయడం కూడా భావ్యం కాదన్నారు. జీసీసీలో గత నాలుగేళ్లుగా ఆడిట్ జరగలేదని ప్రస్తావించారు. పూర్తి స్థాయిలో ఆడిట్ జరిపించి, ఆడిట్లో వెలికివచ్చే అక్రమాలపై కూడా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలోనైనా తప్పనిసరిగా అన్ని నిబంధనలు పాటించాలని, గతేడాది జీసీసీలో జరిగిన నియామక ప్రక్రియను పునస్సమీక్షించాలని సూచించారు. ఈ నియామకాల్లోనూ అక్రమాలు జరిగాయని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అలాగే జీసీసీలో సేల్స్ మెన్లుగా చేరిన వారు ఇరవై, ముప్ఫై సంవత్సరాలు పని చేసినా వారికి పదోన్నతులు రాకపోగా సేల్స్ మెన్లుగానే రిటైర్డ్ అవుతున్నారని తెలిపారు. జీసీసీలో పని చేస్తున్న వారికి బోర్డు ఆమోదం తీసుకొని ప్రమోషన్లు కూడా ఇవ్వాలని ఆదేశించారు.  జీసీసీలోని అన్ని వ్యవహారాలపై దృష్టి సారించి దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని శోభను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com