రాజస్థాన్ : జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ-బస్సును ఢీకొన్న ఘటనలో 8 మంది మరణించిన దుర్ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ నగర సమీపంలో జరిగింది. అజ్మీర్-బేవార్ జాతీయ రహదారిపై లామనా గ్రామం వద్ద వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు.గాయపడిన వారిని అజ్మీర్, బేవార్ నగరాల్లోని అమృత్ కౌర్ ప్రభుత్వ, జేఎల్ఎన్ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన బస్సులో 52 మంది ప్రయాణికులున్నారని వారిలో 8 మంది మరణించగా, మరో 24 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.