మహారాష్ట్ర, హరియానా అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. ఈ రెండు రాష్ట్రాలలో అక్టోబర్ 21న ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది, శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్ వివరాలు ప్రకటించారు. సెప్టెంబర్ 27న మహారాష్ట్ర, హర్యానాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. పోలింగ్ అక్టోబర్ 21న నిర్వహించనున్నారు. ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని చెప్పారు. అక్టోబర్ నాల్గవ తేదీతో నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. అక్టోబర్ అయిదున నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉప సంహరణకు అక్టోబర్ ఎడవ తేదీ వరకూ గడువు విధించారు. అక్టోబర్ 21న ఎన్నికలు నిర్వహించి అక్టోబర్ 24న కౌంటింగ్ నిర్వహించ నున్నట్టు సునిల్ అరోరా తెలిపారు.
ఇప్పటికే ఈ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ రాష్ట్రాలతోపాటు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని ఊహించారంతా. కానీ దానికి సంబంధించిన ప్రకటన విడుదలవ్వలేదు. మహారాష్ట్రలోని 288 సీట్లకు, హర్యానాలోని 90 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మహారాష్ట్రలో 8.94 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనుండగా, హర్యానాలో 1.28 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతానికి బీజేపీ అధికారంలో ఉంది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ఒక జట్టుగా పోటీ చేస్తున్నాయి. వీరిని ఎదుర్కొనేందుకు ఎన్సీపీ తో కాంగ్రెస్ జతకట్టింది.