ఏపీలో నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఈ పరీక్షలను నిర్వహించి గురువారం ఫలితాలను కూడా విడుదల చేశారు. ఈ ఫలితాలను చూసిన తర్వాత ఆశ్చర్యపోవడం పలువురి వంతు అయ్యింది. ఎందుకంటే పేపర్ చూసిన తర్వాత ఈ పేపర్ సివిల్స్ తరహాలో ఉందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో 100 మార్కులు దాటడం కూడా గగనమే అని వారు స్పష్టం చేశారు. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో 112 మార్కులు అత్యధికం. టాప్ ర్యాంకు పొందిన పలువురు అభ్యర్దుల బంధువులు ఏపీపీఎస్సీలో పని చేస్తున్నారు. వారి నుంచి పేపర్ లీకైందని తెలుస్తోంది. పేపర్ ఓ రిటైర్డ్ అధికారి చేతికి కూడా పోయిందని సమాచారం. అనితమ్మ అనే అభ్యర్ధిని కేటగిరి-1లో టాప్ ర్యాంకర్. ఏపీపీఎస్సీలో పరీక్షల వ్యవహారాలు చూసే విభాగంలో అనితమ్మ ఔట్సోర్సింగ్ విధానంలో జూనియర్ అసిస్టెంట్. ప్రశ్నపత్రం టైప్ చేసిందీ ఆమేనని కమిషన్ వర్గాలే అంటున్నాయి. దొడ్డా వెంకట్రామిరెడ్డి అనే అభ్యర్ధి కేటగిరి-3లో ఫస్ట్ ర్యాంకర్. కేటగిరి-1లో మూడో ర్యాంకర్. ఆయన సొంత అన్న ఏపీపీఎస్సీలో ఏఎస్వో. ఇలా పలు టాప్ ర్యాంకర్లకు ఏపీపీఎస్సీలో బంధువులున్నారని సమాచారం. ఒక ఉద్యోగి కుటుంబంలో ఏకంగా ముగ్గురికి మంచి ర్యాంకులు వచ్చాయని సమాచారం. మొత్తానికి సచివాలయ పరీక్ష పేపర్ లీకైందన్న అనుమానాలు బలపడుతున్నాయి. దీని పై విద్యార్ధి సంఘాలు, పరీక్ష రాసిన అభ్యర్ధులు నిరసన వ్యక్తం చేశారు. పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించి నియమాకాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో ఉద్యమిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఆరోపణల పై ఏపీపీఎస్సీ, ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి.