ప్రకాశం జిల్లా లోని ఓ డ్రైవర్ నిర్లక్ష్యం పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. వేగంగా వెళుతున్న ఓ స్కూలు బస్సు మలుపు వద్ద అదుపు తప్పి పంట కాల్వలోకి పల్టీ కొట్టింది. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది. జిల్లాలోని దర్శి మండలం, చింతలపాడులో 15 మంది విద్యార్థులతో ఎస్వీఆర్ పాఠశాల బస్సు బయలుదేరింది. అయితే చింతలపాడు వద్ద ప్రమాదకరమైన మలుపు ఉన్నప్పటికీ డ్రైవర్ వాహనాన్ని వేగంగానే పోనిచ్చాడు. దీంతో అదుపు తప్పిన స్కూలు బస్సు కాలువలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. దీంతో చిన్నారులంతా హహాకారాలు చేశారు. దీంతో అక్కడే పొలంలో పనిచేసుకుంటున్న రైతులు, అటుగా వెళుతున్న ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలను తిరగబడ్డ బస్సు నుంచి బయటకు తీశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆరుగురు చిన్నారులను దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలైన మిగతా పిల్లలకు చికిత్స చేసి ఇళ్లకు పంపించి వేశారు.