ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం ప్రాజెక్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డ్యామ్ లోని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. కేంద్రంలోని ఒకటో జనరేటర్ లో మంటలు చెలరేగడంతో భారీగా పొగ కమ్ముకుంది. వెంటనే అప్రమత్తమైన జలవిద్యుత్ కేంద్రం సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విషయమై జలవిద్యుత్ కేంద్రం ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఒకటో నంబర్ జనరేటర్ లో బ్రేక్ ప్యాడ్స్ మధ్య మంటలు చెలరేగాయని తెలిపారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం జనరేటర్ ను పునరుద్ధరిస్తున్నామనీ, త్వరలోనే విద్యుత్ ఉత్పత్తిని తిరిగి మొదలుపెడతామని పేర్కొన్నారు.