తిరుమలకు వచ్చే భక్తులు, తమకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు ఎదురైనా నేరుగా తన కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. నడకదారి మార్గంలో ఉన్న చిరు వ్యాపార సముదాయాలను తనిఖీ చేసిన ఆయన, ఎంఆర్పీ ధరలకు మాత్రమే తినుబండారాలను అమ్మాలని ఆదేశించారు. ఆపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "తిరుమలకు వెళ్ళే మెట్ల మార్గంలో తనిఖీ నిర్వహించడం జరిగింది. నడకదారి సౌకర్యాల గురించి పలువురు భక్తులను వాకబు చేయడం జరిగింది. ఇక్కడ దుకాణాలు నడుపుతున్నవారు సుచికరమైన పదార్థాలు ఎం ఆర్ పి ధరలకే విక్రయించాలని సూచించడమైనది" అని అన్నారు. ఆపై, "నడకదారి పరిసరాలు, మరుగుదొడ్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడమైనది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఎదురైనా వెంటనే చైర్మన్ కార్యాలయంనందు ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాను" అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.