తూర్పుగోదావరి కచ్చులూరు మండలం దేవీపట్నం సమీపంలో గోదావరిలో జరిగిన లాంచీ ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. లాంచీలో ప్రయాణ సమయంలో దాదాపు 60 మందికి పైగా టూరిస్టులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. గల్లంతైన వారిలో 17 మందిని తూటిగుంట గ్రామస్థులు రక్షించారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతం గోదావరిలోనే అత్యంత లోతైన ప్రాంతంగా అధికారులు చెబుతున్నారు. అక్కడ నది లోతు 250 అడుగులకు పైగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా పడవ ప్రమాద సమయంలో గోదావరిలో 5 లక్షల క్యూసెక్కల వరద నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా, 2018 మే 16వ తేదీని పోలవరం మండలం వాడపల్లి వద్ద లాంచీ మునిగిన ఘనటలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 15 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మళ్లీ ఇప్పుడు పడవ ప్రమాదం గోదావరి జిల్లాల ప్రజలనే కాకుండా.. తెలుగు రాష్ట్రాల ప్రజలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తోంది. బోటు యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.