సైబర్ నేరగాళ్లకు వారూ, వీరూ అన్న తేడాలేకుండా ఉంది. హ్యాకర్లు ఎంతలా రెచ్చిపోతున్నారనేందుకు ఉదాహరణ సాక్షాత్తు ట్విట్టర్ సీఈఓ, సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఖాతా హ్యాకింగ్. గుర్తు తెలియని దుండగులు శుక్రవారం ఆయన ఖాతాను హ్యాక్ చేశారు. దాదాపు 15నిమిషాల పాటు తమ అధీనంలో ఖాతా ఉంచుకుని జాత్యహంకార, దేశ విద్రోహ వ్యాఖ్యలున్న అనుచిత సందేశాలు పంపారు. దీన్ని పసిగట్టిన సంస్థ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఖాతాను హ్యాకర్ల ముప్పు నుంచి కాపాడారు. దుండగులు పోస్ట్ చేసిన అనుచిత సందేశాలను తొలగించారు.అయితే ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ చీఫ్ ఖాతానే కాపాడలేనప్పుడు మిగిలిన యూజర్ల పరిస్థితి ఏమిటని నిలదీశారు. దీంతో అసలు డోర్సీ ట్విటర్ ఖాతా ఎలా హ్యాక్ అయింది? భద్రతా లోపాలు ఎక్కడ ఉన్నాయి? అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ట్విటర్ అధికార ప్రతినిధి వెల్లడించారు.