తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. ఇవాళ ఉదయం బ్రహ్మయ్యకు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బ్రహ్మయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పసుపులేటి మృతిపట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రహ్మయ్యకు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో అమరావతిలోని రమేశ్ హాస్పిటల్లో వైద్యులు ఆయనకు చికిత్స చేయడంతో కోలుకున్నారు. 2019 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ సీటు ఆశించినప్పటికీ బ్రహ్మయ్యకు దక్కలేదు. సాధారణ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన బ్రహ్మయ్య.. 1994లో రాజంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖాదీ బోర్డు చైర్మన్గా పని చేశారు. చంద్రబాబు కేబినెట్లో చిన్నతరహా పరిశ్రమలు, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఆయన సేవలందించారు. 2004 ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసినప్పటికీ బ్రహ్మయ్యకు విజయం దక్కలేదు