బెంగళూరు: ఈనెల 20వ తేదీన కర్ణాటక కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'గత ప్రభుత్వ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తాం. సీఎల్పీ నేత సహా పలువురు నాయకులు దర్యాప్తునకు డిమాండ్ చేశారు. మూడు, నాలుగు రోజుల తర్వాత బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని' యెడ్డీ పేర్కొన్నారు. కర్ణాటక రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మంత్రివర్గాన్ని మూడు విడతలుగా విస్తరిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గత మూడు వారాలుగా యడియూరప్ప ఒక్కరే రాష్ర్టాన్ని పాలిస్తుండటంతో విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. మొత్తం 34 శాఖలకు తొలి కేబినెట్ విస్తరణలో 11 నుంచి 13 మందిని నియమించనున్నట్లు తెలుస్తోంది.