తమిళనాడులోని కాంచీపురంలో గల అత్తివరదరాజస్వామిని ప్రముఖ నటుడు రజనీకాంత్ దర్శించుకున్నారు. ఈ ఉదయం కుటుంబసమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, వేదపండితులు సాదరస్వాగతం పలికారు. అనంతరం రజనీ దంపతులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. వారం క్రితం రజనీ భార్య లత ఒక్కరే ఆలయానికి రాగా.. ఇప్పుడు దంపతులిద్దరూ వచ్చి స్వామిని దర్శించుకున్నారు.
కాంచీపురంలో కొలువైన అత్తివరదరాజ స్వామి 40ఏళ్లకోసారి 48 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. చివరిసారిగా 1979లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి మళ్లీ ఈ ఏడాది జూన్ 1 నుంచి దర్శనమిస్తున్నారు. ఆగస్టు 17 వరకు దర్శించుకోవచ్చు. తిరిగి ఆగస్టు 18న స్వామి వారిని పుష్కరిణిలో దాచిపెడతారు. స్వామి దర్శనానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. దేశ విదేశాల నుంచి వస్తున్న లక్షలాది మంది భక్తులతో కాంచీపురం జనసంద్రంగా మారింది. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు.