దిల్లీ: జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ స్థాయికి తగిన విధంగా ప్రదర్శన చేయకపోవడంతో ఐపీఎల్ పదో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఓటములను చవిచూస్తుంది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్లో విజయం సాధించడం ఆర్సీబీకి ఆందోళన కలిగించే విషయం. ఐతే జట్టు కూర్పులో ఇబ్బందిపడుతూ.. ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకున్న బెంగళూరు సారథి విరాట్ కోహ్లికి భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పలు సలహాలిచ్చాడు.
వాట్సన్ స్థానంలో గేల్..
‘కరిబియన్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్గేల్ను తిరిగి జట్టులోకి తీసుకురావడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలి. ఐపీఎల్లో గేల్ను ఆడించాలి. షేన్వాట్సన్ ఆల్రౌండర్ అని అతన్ని జట్టులో తీసుకుంటున్నారు. కానీ అతడు ఏమాత్రం రాణించట్లేదు. అయినా అతను ఇంకా పాత స్టైల్లోనే ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో టాప్ ఆర్డర్లో గేల్ను ఆడించాల్సిన అవసరముంది. ఇన్నింగ్స్ను గొప్పగా ముగించేందుకు డివిలియర్స్ను నెం.5 లేదా నెం.6 స్థానాల్లో బరిలోకి దించాలి. గత సీజన్లో వారు ఏవిధంగానైతే రాణించి ఫైనల్ వరకు చేరారో ఇప్పుడు కూడా అలాంటి పద్ధతిని అమలు చేసేందుకు కొన్ని మార్పులు చేయాల్సి ఉందని’ గంగూలీ అభిప్రాయపడ్డాడు.
గత సీజన్లో కూడా ఆరంభంలో ఆడిన 7 మ్యాచ్ల్లో బెంగళూరు ఐదింటిలో ఓటమిని ఎదుర్కొంది. విరాట్ కోహ్లి ఫామ్లోకి రావడం, చివరలో ఏకంగా నాలుగు శతకాలతో అతడు అసాధారణ ఆటను ప్రదర్శించడంతో ఆఖరి 7 మ్యాచ్ల్లో ఆరింటిలో గెలుపొంది ప్లేఆఫ్కు అర్హత సాధించింది.