గతంలో హైదరాబాద్ లోటస్పాండ్ కేంద్రంగా జరిగిన పార్టీ కార్యకలాపాలు.. ఇక నుంచి తాడేపల్లినుంచి కొనసాగెందుకు వీలుగా వైసీపీ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసి ఆరంభించింది. శనివారం ఈ కార్యక్రమ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆరంభిస్తారని అందరికీ ఆహ్వానాలు పంపారు. తీరా ముహూర్తం టైంకి జగన్ కాకుండా, అక్కడే ఉన్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేత ఆయన రిబ్బన్ కట్ చేయించి కార్యాలయాన్ని ప్రారంభింపజేశారు. దీంతో అక్కడున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. నూతన కార్యాలయం మొత్తం జగన్ పరిశీలించారు. వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు పార్టీ అభ్యర్థులను సైతం నందిగం సురేష్తో జగన్ ప్రకటింపజేసిన సంగతి తెలిసిందే. ఐతే సురేష్ తో పాటు ఆమంచి కి కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వటానికి కారణాలేంటబ్బా అని విశ్లేషించుకొంటున్నారు వైసీపీ నేతలు. కాగా ఈ కార్యాలయంలో ఐటీవింగ్, అనుబంధ విభాగాలు, ముఖ్యనేతల ఛాంబర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మోనిటరింగ్ చేసేందుకు వీలుగా పార్టీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మూడు అంతస్తుల్లో పార్టీ కార్యాలయం నిర్మించారు. మొదటి ఫ్లోర్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండవ ఫ్లోర్లో పార్టీ అనుబంధ విభాగాలు పనిచేయనున్నాయి. మూడవ ఫ్లోర్లో పార్టీ అధ్యక్షుడు జగన్కు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులకు ఛాంబర్లు ఏర్పాటు చేశారు.