నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు నిరసనగా ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రాష్ట్రశాఖ ప్రకటించింది. ఐఎంఏ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీహరిరావు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఫణీంద్ర, జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధరరావు వెల్లడించారు. ఆరోజు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులను పూర్తిగా మూసివేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం గవర్నర్పేటలోని ఐఎంఏ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైద్య విద్యకు తీరని విఘాతం కలిగించే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ, 2017 నుంచి పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా బిల్లును ఆమోదింపచేసుకుందన్నారు. దీనిని నిరసిస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామని, 8న వైద్యసేవలన్నీ పూర్తిగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. 9 నుంచి 15 వరకు శాంతియుత ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జాతీయ సంఘం పిలుపు మేరకు 15వ తేదీ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.