నిన్న మొన్నటి వరకు నీరు లేక సాగు తూర్పుగోదావరి జిల్లాలో ఆలస్యం జరగాయి. ఆలస్యంగా నారుమళ్లువేసి నాట్లు వేసినప్పటికీ గత కొద్దిరోజులు నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ప్రస్తుతం డెల్టా ప్రాంతంలోనినాట్లువేసిన చేలన్నీ పూర్తిగా మునిగి చెరువులను తలపిస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి జిల్లాలు గజగజ వణుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. పలుచోట్ల చెట్లు నేలకూలి రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని వస్తున్న హెచ్చరికలతో రైతులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి
కాగా భారీ వర్షాలకు సీలేరు నదిలో ఇన్ఫ్లో పెరగడంతో వై రామవరం మండలం డొంకరాయి డ్యాం వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచి రెండు గేట్లు ఎత్తివేసి సీలేరు నీరు విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా సుమారు 4,400 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పవర్ కెనాల్ ద్వారా మరో నాలుగువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతమైన ఒడిస్సాలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో నది ప్రమాద స్థాయి నీటిమట్టం 10.37 అడుగులకు మించి ప్రవహిస్తోంది. ఈ నీరు చింతూరు మండలం మీదుగా శబరి నదిలో కలిసి గోదావరిలో కలుస్తుంది. దీని ప్రభావంతో గోదావరి నీటిమట్టం భారీగా పెరిగే అవకాశం ఉంది.