వ్యాపారం తప్పు కాదు. చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైనా నీతినిజాయితీగా చేస్తే మెచ్చుకోవాల్సిందే. కానీ కొందరు దురాశతో నీతిని నూనెలో వేయించి, డబ్బులను భయంకరంగా కూడబెడుతుంటారు. కుబేరులైనా, కిల్లీకొట్టు వ్యాపారి అయినా దీనికి అతీతం కాదు. కచోరీలు అమ్మి కోట్లు కూడబెట్టిన ఓ ‘చిరు వ్యాపారి’ బండారం బట్టబయలైంది. ఆదాయ పన్ను శాఖ అధికారులు అతని దుకాణంపై దాడి చేయడంతో విస్మయం కలిగించే నిజాలు బయటికొచ్చాయి.
యూపీలోని అలీగఢ్ రాష్ట్రంలో జరిగిందీ తతంగం. రద్దీగా ఉండే రోడ్డులో ఓ థియేటర్ పక్కన ముఖేశ్ కుమార్ అనే వ్యక్తి కచోరీల షాపు నడుపుతున్నాడు. పైకి అతి సాదాసీదాగా, మసిబట్టలతో కనిపిస్తుంటాడు. అయితే షాపు రాత్రి 11 గంటల వరకూ రద్దీగా ఉంటుంది. కచోరీలు పెనంలోంచి బయటికి రావడమే ఆలస్యం అన్నట్లు హాటు కేకుల్లా అమ్ముడుబోతుంటాయి. పార్సిళ్లకు లెక్కేలేదు. ముఖేశ్ గల్లాపెట్టె నిండుగా ఉంటుంది. ఏకంగా పది మంది పనిమనుషులు కూడా ఉన్నారు. ఎవరో కన్నుకుట్టి ఈ విషయాన్ని వాణిజ్య పన్ను శాఖ అధికారులకు చేరవేశారు. వారు మొదట్లో నమ్మలేదు. ఊరికే చిన్న షాపుపై దాడి చేసి పరువు పొగొట్టుకోవడం ఎందుకని అనుకున్నారు. మొదట అతన సంగతేందో చూడాలని నిర్ణయించుకుని షాపుపై రెండు రోజులు నిఘా పెట్టారు. రద్దీ చూసి అవాక్కయ్యారు. ముఖేశ్ పన్ను కట్టడం లేదని నిర్ధారించుకుని షాపుపై, అతని ఇంటిపై దాడి చేశారు. అతడు కచోరీల వ్యాపారంలో ఏటా కోటి రూపాయాలు సంపాదిస్తున్నట్లు తేలింది. అయితే చిన్నషాపు సాకుతో పన్ను ఎగ్గొట్టేస్తున్నాడని, కనీసం జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా లేదని వెల్లడైంది. ముఖేశ్ కోటి రూపాయల పన్ను ఎగ్గొట్టాడని నిర్ధారించిన అధికారులు దాన్ని జరిమానాతోపాటు వసూలు చేస్తున్నారు.