తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2.00 నుండి 3.30 గంటల వరకు ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. అనంతరం ఆలయ బయట గల వాహనమండపంలో శ్రీసుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేసారు. కాగా ఈ రోజు మంగళవారం రాత్రి స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.