కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమిపై సుమారు నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల ఫలితాలపై కమిటీ విశ్లేషించింది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా నిర్ణయం పట్ల సమావేశంలో సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ కూడా రాహుల్ రాజీనామాను తిరస్కరించారు. రాహుల్ రాజీనామా ప్రతిపాదనను సీడబ్ల్యూసీ సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారని కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను రాహుల్కే అప్పగించామని..అతని నాయకత్వంలోనే పార్టీ ముందుకెళ్తుందని పార్టీ నాయకులు వివరించారు.