దిల్లీ: వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) బిల్లులకు లోక్సభ ఆమోదం లభించడంతో తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధమయింది. దీని అమలుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయడంపై చర్చించేందుకు శుక్రవారం జీఎస్టీ మండలి సమావేశం కానుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్, చెల్లింపులు, సొమ్ము వాపసు, ఇన్వాయిస్, రిటర్నుల సమర్పణపై విధివిధానాలను రూపొందించింది. అయితే ఆమోదించిన చట్టాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. పన్ను పరిధిలోకి వచ్చే అంశాలు, పన్ను మదింపు, వస్తువుల రవాణా, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు సంబంధించిన విధివిధానాలపైనా చర్చలు జరుగుతాయి. జీఎస్టీ మండలి సమావేశం ప్రారంభంకావడానికి ముందు అధికారుల కమిటీ సమావేశమయి చర్చలు జరుపుతుంది. రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు, రిటర్నుల దాఖలు, ఇన్వాయిస్, సొమ్ము వాపసు కోసం దరఖాస్తు చేయడం వంటి వ్యవహారాల్లో ఒకేమాదిరిగా ఉన్న నిబంధనలను మిళితం చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది.