తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి, శ్రీ సీతాలక్ష్మణాంజనేయ సమేత శ్రీరామచంద్రుడు, శ్రీరుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి వసంతోత్సవంలో పాల్గొన్నారు. త్రేతాయుగం నాటి రాముణ్ణి, ద్వాపర యుగం నాటి కృష్ణుణ్ని తానేనంటూ.. కలియుగ వేంకటేశ్వరుడు సందేశమిస్తున్నట్లుగా .. ఓవైపు రాముడు, మరో వైపు కృష్ణుడి మూర్తుల మధ్య భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవంలో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్ల మూర్తులకు అభిషేకాదులు పూర్తయ్యాక.. సర్వాంగసుందరంగా, స్వర్ణాభరణాలతో, పూలమాలలతో అలంకరించారు. మధ్యాహ్నం ఆస్థానం అనంతరం నివేదన, ప్రసాద వితరణ పూర్తిచేసి.. ఉత్సవమూర్తులు వేర్వేరు పీఠాల్లో ప్రతిష్టించి వైభవంగా ఊరేగించారు. ఆలయ ప్రవేశం చేయడంతో వార్షిక వసంతోత్సవాలు ముగిశాయి.