నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో కోడెల శివప్రసాద్ చవిచూసిన చేదు అనుభవం. ఒక్కసారి రేపల్లెల్లో గెలిచిన అంబటి రాంబాబు.. మరోసారి ఎమ్మెల్యే కావాలనే పోరాటం. మధ్యలో తనకు రాజకీయంగా అన్యాయం జరిగిందని జనసేన పంచన చేరిన యర్రం వెంకటేశ్వరెడ్డి మరోవైపు. ఎట్టకేలకు ముక్కోణపు పోటీ. 2014లో చివరి నిమిషాన టికెట్ తెచ్చుకున్న కోడెలకు సత్తెనపల్లి బాగా కలిసోచ్చింది. స్పీకర్ పదవిలో బాగానే పనిచేశారనే పేరు తెచ్చుకున్నారు. పిల్లల పెత్తనంతో చెడ్డ పేరు కూడా అదేస్థాయిలో జేబులో వేసుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కోడెల వద్దంటూ స్వతహాగా టీడీపీ లీడర్లు ధర్నాలు చేశారు. అయినా కోడెల శాయశక్తులా ప్రయత్నించి ఎట్టకేలకు సీటు తెచ్చుకున్నారు. ఈ దఫా అంబటికే అవకాశాలున్నాయంటూ సర్వేలు కూడా తేల్చాయి. కమ్మ, వైశ్య, కాపు, బీసీ, రెడ్డి వర్గాల ఓట్లు చాలా కీలకం. అటువంటి చోట కోడెల ఓటు బ్యాంకు కొంత యర్రం, మరికొంత అంబటి చీల్చుకుంటారనే ఆందోళన కూడా ఉంది. దీన్ని ముందుగానే గమనించిన అంబటి కాపులను కలసి తనను గెలిపించమంటూ ప్రాధేయపడ్డారు. రెడ్లు ఎలాగూ వైసీపీ వైపు ఉంటారనే నమ్మకం ఉంది. కోడెలను వ్యతిరేకిస్తున్న వారిలో బీసీ, ఎస్సీ, వైశ్యులు కూడా ఉండటంతో అంబటి తన గెలుపు నల్లేరుపై నడక అనుకున్నాడు. రాజుపాలెం మండలం వాస్తవంగానే వైసీపీ ఓటుబ్యాంకు గొడవ జరిగిన గ్రామం ఇనుమెట్లలో వైసీపీదే అగ్రభాగం. అటువంటి చోటికి కోడెల వెళ్లటం ముందస్తు పథకంలో భాగమే అంటున్నారు వైసీపీ నేతలు. కావాలని తమను రెచ్చగొట్టేందుకు వచ్చాడంటున్నారు. ఇది కాస్త గొడవగా మారటం.. కోడెలకు పరాభవం జరగటం జరిగాయి. దీనిపై వైసీపీ నేతలు ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. నాలుగు రోజుల తరువాత వైసీపీ ఫిర్యాదుపై పోలీసులు స్పందించి కోడెలపై కేసు నమోదుచేశారు. దీనిపై కోడెల, అంబటి మీడియా సమావేశాలు పెట్టి మరీ విమర్శలు గుప్పించుకుంటున్నారు. పైగా ఎవరికి వారు తమదే గెలుపు అనే ధీమాతో ఉన్నారు. కోడెల మరో అడుగు ముందుకేసి అసలు నాకు అంబటి పోటీయే కాదంటూ మరింత ఆత్మవిశ్వాసంగా చెప్పటం అంబటి వర్గాన్ని రెచ్చగొట్టినట్టుగానే మారింది. ఇటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో మున్ముందు ఇక్కడ ఇంకెంతటి గొడవలు జరుగుతాయనే ఆందోళన లేకపోలేదు.