దక్షిణ కరేబియన్లో వెనుజులా నౌకపై అమెరికా సైన్యం గతవారం (సెప్టెంబరు 1న) జరిపిన దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సైన్యం చర్యలపై అంతర్జాతీయ, మారిటైమ్ న్యాయ నిపుణులు నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నౌకపై దాడిచేయడానికి అమెరికాకు ఉన్న చట్టబద్దమైన అధికారం ఏంటి? అని వారు నిలదీస్తున్నారు. తాజాగా, ఈ విమర్శలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ.. తమ సైన్యం దాడులను సమర్దించుకోవడం గమనార్హం. తోటి పౌరులను మత్తుకు బానిసలుగా చేసే ముఠాలను చంపడం తప్పుకాదని అన్నారు. మా సైన్యం అత్యున్నత, ఉత్తమ చర్య అని రాజకీయ విమర్శకుడు చేసిన ట్వీట్కు ఎక్స్ (ట్విట్టర్)లో కౌంటర్ ఇచ్చారు.
రాజకీయ విమర్శకుడు బ్రియాన్ క్రాసెన్స్టెయిన్ ‘‘ఎటువంటి విచారణ లేకుండా మరో దేశానికి చెందిన పౌరులను చంపడం యుద్ధ నేరంగా పరిగణిస్తారు’’ అని ఎక్స్లో విమర్శించారు. దీనిపై తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ స్పందిస్తూ.. ‘మన పౌరులకు విషమిస్తోన్న వారిని చంపడం సైన్యం అత్యున్నత, ఉత్తమ చర్య’ అని అన్నారు. అయితే, వాన్స్ అమెరికా చర్యలను సమర్దించుకుంటున్నా.. అంతర్జాతీయ, మారీటైమ్ చట్టాల నిపుణులు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. వెనుజులా పడవపై అమెరికా సైన్యం ఏ అధికారంతో దాడిచేసిందని? ఇది అన్యాయమైనందని ఆరోపిస్తున్నారు.
అమెరికా ‘దాని నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి’ అని వాదించిన న్యాయ నిపుణులు.. సముద్ర చట్టాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి తీర్మానంపై అమెరికా సంతకం చేయలేదని పేర్కొన్నారు. కాగా, సెప్టెంబరు 1న దక్షిణ కరేబియాలో డ్రగ్స్ను తీసుకెళ్తోన్న వెనుజులా నౌకపై తమ సైన్యం జరిపిన దాడిలో 11 మంది మృతిచెందినట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. ఆ ప్రాంతంలో యుద్ధ నౌకలను మోహరించిన తర్వాత ఇదే మొదటి ఆపరేషన్ అని అన్నారు. సైన్యం పేల్చేసిన ఆ పడవలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయని తెలిపారు. ‘‘అది ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకా చాలా సమాచారం ఉంది.. మన దేశంలోకి చాలా కాలంగా చాలా డ్రగ్స్ వెనిజులా నుంచి వస్తున్నాయి’’ అని ట్రంప్ అన్నారు. సైన్యం దాడిచేసిన వీడియోను కూడా ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా షేర్ చేశారు.
పడవలో ఉన్న సిబ్బందిని అమెరికా ఈ ఏడాది ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన వెనుజులా గ్యాంగ్ ట్రెన్ డే అరగువా సభ్యులుగా సైన్యం గుర్తించినట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఈ ముఠా వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కనుసన్నల్లో కార్యకలాపాలు సాగిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ గతంలోనూ ఇలంటి ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే, అగ్రరాజ్యం సైన్యం చర్యలపై వెనుజులా అధ్యక్షుడు తీవ్రంగా మండిపడ్డారు. తమ దేశ పౌరులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa