లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించిన సినీ నటి, మాజీ కాంగ్రెస్ నాయకుడు దివంగత అంబరీశ్ సతీమణి సుమలత కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమిలో భాగంగా మాండ్యా నియోజకవర్గాన్ని జేడీఎస్ అభ్యర్ధికి కేటాయించారు. ఆ నియోజకవర్గం నుంచి కర్ణాటక సీఎం కుమార స్వామి కుమారుడు నిఖిల్ కుమార స్వామి పోటీ చేస్తున్నారు.
మాండ్యా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టకపోవడం వల్ల కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతింటుందని సుమలత గతంలోనే ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి ఆమె టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ మాండ్యా ప్రజలు తనను ఆదరిస్తారన్నారు.
అంబరీష్ మరణం తర్వాత ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు సుమలతను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వారు ఆహ్వానిస్తున్నారు. గతంలో ఆమె భర్త అంబరీష్ ఆ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంబరీష్కు మాండ్యా నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. దీంతో అక్కడి నుంచి ఆమె పోటీ చేస్తే, సుమలత విజయం నల్లేరుపై నడకే అవుతుందని భావన నెలకొంటోంది..