ధర్మశాల: భారత్-ఆస్ట్రేలియా మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో లంచ్ విరామ సమయానికి ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ధాటిగా ఆడుతోంది. రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ స్మిత్, ఓపెనర్ వార్నర్ అర్ధశతకాలు పూర్తి చేసి ఆసీస్ను పటిష్ఠ స్థితికి తీసుకొచ్చారు.
బ్యాటింగ్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన ఆసీస్ను భారత్ కట్టడిచేసింది. రెండో ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ రెన్షా ఔటవడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఒకే ఒక్క పరుగు సాధించిన రెన్షా ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ స్మిత్ దూకుడు ప్రదర్శించి జట్టును ఆదుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. 19వ ఓవర్ చివరి బంతిలో అర్ధశతకం నమోదు చేసిన స్మిత్ ఆసీస్ను పటిష్టస్థితికి చేర్చాడు.
మరోవైపు ఓపెనర్ వార్నర్ కూడా అర్ధశతకం పూర్తి చేయడంతో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగింది. 28వ ఓవర్లో కుల్దీప్ వేసిన రెండో బంతికి నాలుగు పరుగులు సాధించిన వార్నర్ 50 పరుగులు పూర్తి చేశాడు. దీంతో లంచ్ విరామానికి 31 ఓవర్లు ఆడిన ఆసీస్ వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రస్తుతం స్మిత్(72), వార్నర్(54) క్రీజులో ఉన్నారు.