ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగా మరో నాలుగు వందేభారత్ రైళ్లు.. తెలుగు రాష్ట్రాలకు ఒకటి.. ఈ రూట్‌లోనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2024, 04:43 PM

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సెమీ-హైస్పీడ్ రైలు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, ప్రధాన నగరాల మధ్య 66 రైళ్లు నడుస్తున్నాయి. సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని అధునాతన సౌకర్యాలు, ప్రత్యేకతలు వందే భారత్‌కు అదనపు ఆకర్షణ. దీంతో ఈ రైళ్లకు డిమాండ్ పెరుగూత ఆక్యుపెన్సీ రేషియో అధికంగా ఉంటోంది. పండగల సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చే ఉద్దేశంతో వందే భారత్‌వైపు మొగ్గుచూపుతున్నారు.


ప్రయాణికుల నుంచి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని వందేభారత్‌లను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. డిమాండ్‌ను ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. ఈ క్రమంలో మరో నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించనుంది. మహారాష్ట్రలోని పుణే రైల్వే స్టేషన్‌ నుంచి వివిధ మార్గాల్లో ఈ నాలుగు రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తాయి. వీటిలో ఒకటి సికింద్రాబాద్‌కు నడపనున్నారు. పుణే- సికింద్రాబాద్,. పుణే- షెగావ్ (మహారాష్ట్ర), పుణే- వడోదర (గుజరాత్), పుణే- బెళగావి (కర్ణాటక) మధ్య ఈ రైళ్లను నడుపుతారు. ఈ రైళ్ల షెడ్యూల్, టైమ్ టేబుల్, ఆగే స్టేషన్ల వంటి వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.


ఈ రైళ్ల ప్రారంభ తేదీని రైల్వే మంత్రిత్వ శాఖ ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో కోడ్ అమల్లో ఉంది. ఇది ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రైళ్లకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా పూర్తిచేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం పుణే- కొల్హాపూర్ మధ్య వందే భారత్ రైలు నడుస్తోంది. సోలాపూర్ నుంచి ముంబై మధ్య నడిచే మరో ఎక్స్‌ప్రెస్ పుణే మీదుగా వెళ్తుంది. వీటికి అదనంగా ఈ నాలుగు అందుబాటులోకి రానున్నాయి.


ఇక, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సికింద్రాబాద్- విశాఖ- తిరుపతి మధ్య వందేభారత్ రైలు అందుబాటులో ఉంది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య రెండు రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైలు కూడా పట్టాలెక్కనుంది. ఈ రైలు ట్రయల్ రన్ నవంబరు 15న మొదలై.. రెండు నెలల పాటు సాగుతుందని అధికారులు తెలిపారు. దీంతో జనవరి చివరి వారంలో ఇవి ప్రారంభం కానున్నాయి. వందేభారత్‌ తొలి స్లీపర్‌ రైలు తొలి విడతలో సికింద్రాబాద్ నుంచి ఒకటి నడపుతారని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com