వైయస్ఆర్ జిల్లాలో ఇంటర్మీడియట్ యువతి కిడ్నాప్, హత్యాయత్నం చేయడం దుర్మార్గమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి పేర్కొన్నారు. ఈ ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆడపిల్లల మాన, ప్రాణాల రక్షణలో కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. రాష్ట్రంలో మహిళలు బ్రతకాలా వద్దా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రతీ జిల్లాల్లో ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా.. ఆడ పిల్లల మాన ప్రాణాలు రక్షించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. సీఐ తల్లినే హత్య చేశారంటే... రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుందన్నారు. రాష్ట్రంలో రోజుకో దారుణమైన సంఘటన వెలుగు చూడ్డం బాధాకరమన్నారు. వైయస్ఆర్ జిల్లాలో ఇంటర్మీడియట్ యువతి కిడ్నాప్, హత్యాయత్నం దుర్మార్గమని... ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.