లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తమవేనని, శివసేన కూడా తమతోనే నడుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీపై... ఆ పార్టీ మిత్రపక్షం శివసేన తీవ్ర స్థాయితో స్పందించింది. రైతు సమస్యలు, రాఫెల్ వివాదం, ఈవీఎం లోపాలు సహా ఇటీవల బీజేపీ నేతలు చేస్తున్న ‘‘బాధ్యతారహిత’’ ప్రకటనలపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడింది. మహారాష్ట్రలో కనీసం 43 నుంచి 48 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ ‘‘అతి విశ్వాసం’’ వ్యక్తం చేస్తోందని దుయ్యబట్టింది. శివసేన పార్టీ పత్రిక సామ్నాలో ఈ మేరకు ఇవాళ ఓ కథనాన్ని ప్రచురించింది.
‘‘ఈవీఎంలు, పసలేని విశ్వాసం ఇలాగే కొనసాగితే లండన్, అమెరికాలో కూడా కమలం వికసించడం కష్టమేమీ కాదు..’’ అంటూ శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అంత విశ్వాసం ఉంటే అయోధ్యలో రామమందిరం ఎందుకు నిర్మించలేకపోయారని అధికార పార్టీని నిలదీసింది. ‘‘అయోధ్యలో కమలం ఎందుకు పూయలేదు...?’’ అని ప్రశ్నించింది. బీజేపీ నిస్సహాయ పరిస్థితిలో లేదనీ... శివసేన మైత్రి నిలుపుకునేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని ఇటీవల సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలపైనా ఘాటుగా స్పందించింది.
‘‘ఇప్పుడున్న 42 స్థానాలకంటే మహారాష్ట్రలో మరో సీటు ఎక్కువగానే గెలుస్తామని ఇటీవల ఫడ్నివిస్ ఓ ర్యాలీలో చెప్పారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ముందు ఇలా ఆత్మ విశ్వాసం వ్యక్తం చేసినందుకు ఆయనను మెచ్చుకోవాల్సిందే. గత ఎన్నికల్లో ఆ పార్టీ 42 చోట్ల గెలిచింది. ఇప్పుడు ఎన్సీపీ నేత శరద్ పవార్ కంచుకోట బారామతిలో కూడా గెలుస్తామని ఫడ్నవిస్ చెప్పారు. ఇలాంటి విశ్వాసం ఉంటే 548 లోక్సభ స్థానాల్లోనూ ఆ పార్టీయే గెలవొచ్చు...’’ అంటూ శివసేన కౌంటర్ విసిరింది.