ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమిలి ఎన్నికలు సాధ్యం కావు.. పార్లమెంటులో వ్యతిరేకిస్తామన్న కాంగ్రెస్

national |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 11:19 PM

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జమిలి ఎన్నికలు సాధ్యం కావని కొట్టిపారేస్తోంది. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ ఆమోదం కోసం బిల్లు పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కీలక సన్నాహాలు చేస్తుండగా.. ఎలాగైనా దాన్ని వ్యతిరేకించి ఓడగొడతామని, సభలో బిల్లును అడ్డుకుంటామని హస్తం పార్టీ కరాఖండిగా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో ఇప్పుడు ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


జమిలి ఎన్నికల నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించిందని వార్తలు వస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను తమ పార్టీ తిరస్కరిస్తోందని చెప్పారు. అంతేకాకుండా ఈ జమిలి ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న వేళ.. బీజేపీ వేస్తున్న ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగమే ఈ జమిలి ఎన్నికలు అని ఆయన కొట్టిపారేశారు. దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు వచ్చినా.. బీజేపీ ఇలాంటి వాటినే తెరపైకి తెస్తుందని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.


ఒకే దేశం ఒకే ఎన్నిక కమిటీ నివేదికపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని ఖర్గే వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని ఆయన స్పష్టం చేశారు. మన దేశ ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.


ఇక ఒకే దేశం ఒకే ఎన్నికలపై మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ జమిలి ఎన్నికలపై ప్రతిపక్ష పార్టీల్లో అంతర్గత ఒత్తిడి పెరిగిపోయిందని మండిపడ్డారు. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు సంబంధించిన చేసిన సంప్రదింపుల ప్రక్రియలో 80 శాతానికి పైగా ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నట్లు తెలిపారు. మరీ ముఖ్యంగా ఈ ఒకే దేశం ఒకే ఎన్నికపై యువత చాలా ఆశాజనకంగా ఉన్నారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com