కర్నూల్: కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి తన సమీప వైసిపి అభ్యర్థి గౌరు వెంకట్ రెడ్డిపై 56 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఇటీవలే మరణించిన టిడిపి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రయత్నించారు. కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 1084 ఓట్లున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కేవలం 1077 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి భారీ మెజారిటీ వస్తోందని భావించినప్పటికీ ఆశించిన మెజారిటీ రాలేదని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డికి 531 ఓట్లు రాగా, వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గౌరు వెంకట్ రెడ్డికి 475 ఓట్లు వచ్చాయి. దీంతో శిల్పా చక్రపాణిరెడ్డి 56 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే 71 ఒట్లు చెల్లుబాటు కాలేదు. అయితే చెల్లుబాటుకాని ఓట్లను కూడ మరోసారి అధికారులు పరిశీలించారు. అయినా టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించినట్టుగా అధికారులు ప్రకటించారు.