కాంగ్రెస్ సెంటర్ లో మేకింగ్ డిజిటల్ గవర్నెన్స్ వర్క్, ఇండియా 4.0 మేకింగ్ టెక్నాలజీ వర్క్ ఫర్ ఆల్ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఏపీ లో అమలు చేస్తున్న టెక్నాలజీ పై లోకేష్ ప్రసంగించారు. పాలన లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది.సంక్షేమ కార్యక్రమాలు అమలు దగ్గర నుండి వివిధ సర్వీసులు కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రియల్ టైం గవర్నెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కనిపించని ప్రభుత్వం, కనిపించే పాలన తీసుకురావాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాం. పేపర్ లెస్ గవర్నెన్స్, ఈ క్యాబినెట్, ఈ ఆఫీస్, రియల్ టైం గవర్నెన్స్ అమలు చేస్తున్నాం. 10 లక్షల ఐఓటి పరికరాలు వినియోగిస్తున్నాం.రి యల్ టైం లో సమాచారం తెలుసుకుంటున్నాం. నీటి నాణ్యత, రోడ్ల నాణ్యత తెలుసు కోవడానికి సెన్సార్లు,డ్రోన్లు వినియోగిస్తున్నాం. ఎల్ఈడి లైట్లను సీసీఎమ్ఎస్ ద్వారా అనుసంధానం చేసాం. ప్రతి ఇంటికి ఆర్ఎఫ్ఐడి కార్డ్ ఏర్పాటు చేసి చెత్త సేకరణ చెయ్యబోతున్నాం. డేటా అనలిటిక్స్, టెక్నాలజీ వినియోగం ద్వారాతక్కువ వర్ష పాతం ఉన్నా, వ్యవసాయంలో వృద్ధి సాధించాం. పత్తి సాగు ద్వారా నష్టం వస్తుంది అని ముందే పసిగట్టి పత్తి సాగుని తగ్గించగలిగామన్నారు. పంచాయతీ రాజ్, ఐటీ శాఖల అనుసంధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అని అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. 4.0 పారిశ్రామిక విప్లవం వలన ఉద్యోగాలు పోతాయి అనే అపోహ ఉంది. ప్రతి పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ఉద్యోగాల సంఖ్య పెరుగుతూనే ఉంది. 4 వ పారిశ్రామిక విప్లవం వలన మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 4 వ పారిశ్రామిక విప్లవం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీని వలన మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశలు ఉన్నాయి.
రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం తక్కువ ఉంది. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ప్రయాణం ప్రారంభించాం. సంక్షోభంలో అవకాశం వెతుక్కోవాలి అన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అధునాతన టెక్నాలజీల వినియోగం లో అందరి కంటే ముందు ఉంది. పుట్టుక నుండి చావు వరకూ ప్రభుత్వం నుండి అందించే అనేక సర్వీసులు ప్రజలు సులభంగా అందుకునేందుకు టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాం. సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాల అమలు లో పారదర్శకత తీసుకొచ్చేందుకు టెక్నాలజీ ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాం. చంద్రన్న భీమా, రేషన్, యువనేస్తం ఇలా అన్ని సంక్షేమ కార్యక్రమాల అమలులో టెక్నాలజీ వినియోగిస్తున్నామని మంత్రి నారా లోకేష్ వివరించారు.