దివంగత రాజీవ్ గాంధీ తనయ ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ప్రియాంకా గాంధీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఎఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రియాంకను కాంగ్రెస్ రంగంలోకి దించింది.ప్రియాంకా గాంధీ సమర్థురాలు అని ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కొనియాడారు. సోదరి నాతో పాటు కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. పేదల సంక్షేమం, బాగు కోసం బాగా పనిచేస్తుందని కితాబునిచ్చారు. ఉత్తర ప్రదేశ్ లో ప్రియాంక కు కీలక బాధ్యతలు అప్పగించామని, ఆ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఆమెకు తెలుసు అని రాహుల్ అన్నారు. పదవి కట్టబెట్టడంతో పాటు క్రియాశీల రాజకీయాల్లోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నదన్నారు.యూపీ తూర్పు ప్రాంతానికి బీజేపీ తరఫున యోగీ ఆదిత్యనాథ్ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తుండగా, ఆయనకు వ్యతిరేకంగా ప్రియాంక ను రంగంలోకి దించారు. ప్రియాంక ప్రవేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోహ్రా మాట్లాడుతూ, చాలా కీలక బాధ్యతలు అప్పగించారన్నారు.