టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు తిరుమలలో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని లోటుపాట్లను గుర్తిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా భక్తులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈవో శ్యామల రావు. శ్రీనివాసమంగాపురం, శ్రీవారి మెట్టు మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కొంతమంది భక్తులు ఫిర్యాదు చేశారన్నారు.
టీటీడీ ఈవో ఆదేశాల మేరకు, జేఈవో (విద్యా, వైద్యం) గౌతమి పర్యవేక్షణలో టీటీడీ ఎస్టేట్ అధికారి గుణ భూషణ్ రెడ్డి శ్రీవారి మెట్టు వద్ద ఉన్న మూడు షాపులను తనిఖీ చేశారు. ఇందులో షాప్ నంబర్-3లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో తిరుమల, తిరుపతిలలో ఎక్కడైనా భక్తులకు టీటీడీ నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలరావు తెలిపారు. అలాగే టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించిన షాప్ నెంబర్ -3 శ్రీ వినోద్ కుమార్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు అధికారులు. అలాగే రూ.25 వేల రూపాయలు జరిమానా విధిస్తామన్నారు.
టీటీడీలోని విభాగాలపై ఈవోశ్యామలరావు సమీక్ష
టీటీడీ ఈవో శ్యామలరావు సోమవారం అన్ని విభాగాధిపతులతో సమగ్రంగా సమీక్షించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్తో పాటు టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు ఈవో. దర్శనం, వసతి, నాణ్యమైన అన్నప్రసాదాలు, పారిశుధ్యం, ఇతర సౌకర్యాలను అత్యున్నతంగా అందించడం మనందరి బాధ్యత అన్నారు.
తాను ఆదివారం తనిఖీలో పరిశీలించినప్పుడు, భక్తుల నుంచి అందిన అభిప్రాయాలు, వారి అంచనాలను చేరుకోవడానికి అందరం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ప్రతి విభాగంలో చెక్ లిస్ట్, టైమ్లైన్, ఫీడ్బ్యాక్ యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను సిద్ధం చేయాలని ఆయన జేఈవోను ఆదేశించారు.
దర్శనం, ఆన్లైన్ కోటా విడుదల, ఆలయానికి సంబంధించి సేవా టిక్కెట్లు, రిసెప్షన్ విభాగంలో వసతి విధానాలు మరియు ఇంజనీరింగ్ పనులపై సంబంధిత అధికారులతో ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. అంతకు మునుపు టీటీడీ ఈవో ముళ్ళకుంట ప్రాంతంలోని వసతి గృహాలు, లడ్డూ కౌంటర్లను తనిఖీ చేసి భక్తుల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అంతేకాదు ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. శ్యామలరావు ఆదివారం సాయంత్రం తిరుమలలోని క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను పరిశీలించి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
తన తనిఖీలో భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందుతుండగా, కొన్ని ప్రాంతాల్లో పాలు అందడం లేదని చెప్పినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, షెడ్లలో వేచి ఉన్న వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో.. భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అక్కడ వంటగదిని పరిశీలించారు.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులను అన్నప్రసాదం గురించి అడిగి తెలుసుకున్నారు.