పసిపిల్లలంటే ప్రతి ఒక్కరికి ప్రాణం.. వారి ముద్దూ, మురిపెం చూడటమంటే మహా సరదా. ఇక వారిని సంతోషంగా ఉంచడానికి ఎన్నో బొమ్మలు కొనిస్తూ ఉంటాం. కానీ ఆ బొమ్మలే వారికి ప్రాణాంతకంగా పరిణమిస్తాయనే విషయం మీకు తెలుసా.. తెలిసీ తెలియక మనం చేసే పని.. ఒక్కోసారి ఆ పసిప్రాణాలను ఎంతగా ఇబ్బంది పెడుతుందో గమనించారా.. అలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 11 నెలల వయసున్న చిన్నారికి ఆమె తల్లిదండ్రులు ఓ బొమ్మను కొనిచ్చారు. అప్పటిదాకా చేతిలో పట్టుకుని దానితో ఆడుకున్న చిన్నారి.. అకస్మాత్తుగ దాన్ని నోట్లో పెట్టుకుంది. దీంతో బొమ్మలో ఉన్న బ్యాటరీ విడిపోయి.. చిన్నారి పొట్టలోకి వెళ్లిపోయింది. అయితే చిన్నారి తల్లి వెంటనే దానిని గమనించడం.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో.. ప్రమాదం తప్పింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం జరిగింది.
తాడేపల్లి గూడెనికి చెందిన ఓ కుటుంబానికి 11 నెలల చిన్నారి ఉంది. అయితే శనివారం మధ్యాహ్నం ఆడుకుంటున్న చిన్నారి.. పొరపాటున బొమ్మలోని బ్యాటరీని మింగేసింది. పక్కనే ఉన్న చిన్నారి తల్లి ఈ విషయాన్ని గుర్తించి.. స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వెంటనే.. విజయవాడకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో భయపడిపోయిన పాప తల్లిదండ్రులు.. హుటాహుటిన అంబులెన్సులో విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
చిన్నారికి ఎక్స్రే తీసిన విజయవాడ ఆయుష్ ఆస్పత్రి వైద్యులు.. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే ఎండోస్కోపీ విధానం ద్వారా కడుపులోకి వెళ్లిన బ్యాటరీని బయటకు తీశారు. దీంతో పాప తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పిల్లలకు ఇలాంటి బొమ్మలు ఇవ్వవద్దని వైద్యులు సూచించారు. ఘటన జరిగిన వెంటనే గుర్తించి ఆస్పత్రికి తీసుకురావటంతో ప్రమాదం తప్పిందన్నారు. అయితే అప్పటికే బ్యాటరీ మీద ఉండే కోటింగ్ పోయిందని.. ఇంకా ఆలస్యమై ఉంటే ప్రమాద తీవ్రత పెరిగేదని తెలిపారు. చిన్నారిని కొద్దిసేపు అబ్జర్వేషన్లో ఉంచిన డాక్టర్లు.. అనంతరం డిశ్చార్జ్ చేశారు.