నవవిధ భక్తిమార్గాల్లో నామసంకీర్తనకు విశేష ప్రాధాన్యం ఉందని, భక్తులు భజనలు, సంకీర్తనల ద్వారా కొలవడం భగవంతునికి ఎంతో ప్రీతికరమైందని బెంగళూరులోని శ్రీ రాఘవేంద్ర మఠం పీఠాధిపతి సువిద్యేంద్రతీర్థస్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు శనివారం తిరుపతిలోని మూడో సత్రం ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్రతీర్థస్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ భగవంతుని చేరాలంటే ముందు ఆయన పరమభక్తుల అనుగ్రహం అవసరమని పురాణాలు పేర్కొంటున్నాయని, ఈ కోవకు చెందిన పరమభక్తుడు శ్రీ పురందరదాసు అన్నారు. నేడు వేలాది మంది భక్తులు పురందరదాసు రచించిన లక్షలాది కీర్తనలు ఆలపిస్తూ స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని, ఇదే కలియుగంలో నామసంకీర్తనకున్న వైశిష్ట్యమన్నారు. దాససాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న భజన మండళ్ల సభ్యుల కృషిని కొనియాడారు.టిటిడి దాససాహిత్యప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 3 వేల మందికిపైగా భజనమండళ్ల సభ్యులు పాల్గొన్నారు.