ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో డ్వాక్రా మహిళలకు మరో గుడ్‌‌న్యూస్.. ఈసారి బంపరాఫర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 08:11 PM

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.27 లక్షల పొదుపు సంఘాలకు రూ.32,190 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అంతేకాదు ఇటీవల కాలంలో కొత్తగా పొదుపు సంఘాల (డ్వాక్రా గ్రూపుల్లో)లో చేరిన లక్ష మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనున్నారు. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే.. మొత్తం 5.39 లక్షల సంఘాలకు రూ.20,437 కోట్ల రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.42,533 కోట్ల రుణాలు అందించారు. అంతేకాదు ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం సున్నా వడ్డీకి రుణాలను కూడా అందజేస్తున్న సంగతి తెలిసిందే.


మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇటీవల వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రూ.1843 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ ఆసరా పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్థిక పురోగతి కోసం ఉపయోగపడుతోంది. వాణిజ్య, సహకార బ్యాంకులలో రుణం తీసుకుని 2019 ఏప్రిల్ 11 నాటికి అప్పు నిల్వ ఉన్న మహిళాస్వయం సహాయక సంఘాలు ఈ పథకానికి అర్హులు. రుణాల అప్పు మొత్తాన్ని నాలుగు విడతలుగా నేరుగా స్వయం సహాయక సంఘాలు పొదుపు ఖాతాలకు జమ చేస్తోంది ప్రభుత్వం.


ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా కింద 2020 సెప్టెంబర్ 11న మొదటి విడతలో రూ.6,318.76 కోట్లను 77,87,295మంది లబ్ధిదారులకు అందజేసింది. అలాగే 2021 అక్టోబర్ 7న రెండో విడతలో 78,75,539 లబ్ధిదారులకు రూ.6,439.52 కోట్లు అందించారు. 2023 మార్చి 25న మూడో విడత కింద.. 78,94,169 మందికి రూ.6,417.69 కోట్లు అందజేశారు. నాలుగో విడతలో 78,94,169మందికి రూ.6,394.83 కోట్లు అందజేశారు. వైఎస్సార్ ఆసరా ద్వారా మొత్తం నాలుగు విడతల్లో ఈ నిధుల్ని లబ్ధిదారులకు అందజేసినట్లు ప్రభుత్వం తెలిపింది.


డ్వాక్రా మహిళలకు జీవనోపాధి మెరుగుపడేలా ప్రభుత్వం ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకుంది. అమూల్‌తో పాటుగా ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, హిందూస్తాన్‌ లివర్ వంటి సంస్థలతో పాటుగా పాటు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాదు పలువురు డ్వాక్రా మహిళలు కిరాణా షాపులు ఏర్పాటు చేసుకున్నారు.. మరికొందరు ఆవులు, గేదెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం వంటి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. అమూల్‌తో ఒప్పందం చేసుకుని పాల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో పట్టణాలతో పాటుగా గ్రామాల్లో కూడా వ్యాపారులు చేస్తున్నారు.. డ్వాక్రా మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడుతున్నారు.. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com