ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్.. వారి అకౌంట్‌లలో రూ.18,750, రూ.15వేలు జమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 08:02 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళలు, రైతులకు వరుసగా డబ్బులు విడుదల చేస్తోంది. తాజాగా మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం, చేయూత, ఆసరా కింద నిధుల్ని వారి, వారి అకౌంట్లకు విడుదల చేసింది. అలాగే రైతులకు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీని కూడా రైతుల అకౌంట్‌లకు జమ చేశారు. ఏపీలో అగ్రవర్ణాలలోని పేద మహిళలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద.. 45 నుంచి 60 ఏళ్లలోపు వారికి ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తోంది.. మార్చి నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కినా డబ్బులు విడుదల కాలేదు. అయితే పోలింగ్‌కు ముందు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయాలని భావించినా ఈసీ అనుమతించలేదు. తాజాగా ఈబీసీ నేస్తం కింది అర్హులైన మహిళల అకౌంట్‌లలో రూ.15వేల చొప్పున జమ చేశారు.


మరోవైపు వైఎస్సార్‌ చేయూత కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల వరకు అర్హులైనవారికి ఏడాదికి రూ.18,750 అందిస్తోంది ప్రభుత్వం. మార్చి నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కినా ఈ డబ్బులు జమ కాలేదు.. ఎన్నికల కోడ్‌తో ఆగిపోయాయి. ఈ పథకానికి సంబంధించి కూడా తాజాగా ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.18,750 జమ చేసింది ప్రభుత్వం. అలాగే వైఎస్సార్ ఆసరా కింద ప్రభుత్వం డ్వాక్రా మహిళలకురూ.1843 కోట్లను వారి, వారి ఖాతాలలో జమ చేశారు. రైతులకు సైతం రూ.1236 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీ కింద విడుదల చేశారు. ఈ పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాను ఇప్పటికే ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. అర్హత ఉన్నలబ్ధిదారులకు ఈ డబ్బుల్ని జమ చేస్తున్నారు.. ఒకవేళ జమకాని పక్షంలో దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది.


ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి డబ్బుల విడుదలకు ప్రతి ఏటా క్యాలెండర్‌ను ముందుగానే విడుదల చేస్తోంది. 2024కు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేశారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అందుకు తగిన విధంగా బటన్ నొక్కారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో పథకాల డబ్బులు లబ్దిదారుల అకౌంట్‌లలో జమకాలేదు. మే 13 పోలింగ్ సమయంలో ఈ డబ్బుల్ని అకౌంట్‌లలో జమ చేస్తామని ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేయగా.. అనుమతి రాలేదు. దీంతో పలువురు లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.. డబ్బులు జమ చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లు దాఖలు చేశారు.


ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. ఎన్నికల సంఘానికి మరోసారి రిక్వెస్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో ప్రభుత్వం మరోసారి డీబీటీ పథకాల డబ్బులు జమ చేసేందుకు అనుమతివ్వాలని కోరినా.. తిరస్కరించారు.. ఇప్పుడు అంత అత్యవసరం ఏంటని ఈసీ ప్రశ్నించింది. పోలింగ్ ముగిసిన తర్వాత జమ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ పిటిషన్లపై మరోసారి కోర్టులో విచారణ జరగ్గా.. మే 10 వరకు ఈసీ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెడుతున్నట్లు సింగిల్ జడ్జి తీర్పును వెల్లడించారు. ఈ క్రమంలో మే 10న డబ్బుల్ని జమ చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. ఈసీని అనుమతి కోరగా.. మరోసారి నిరాకరించింది. మళ్లీ హైకోర్టులో విచారణ జరగ్గా.. వేసవి సెలవుల తర్వాతకు ఈ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. దీంతో డబ్బుల్ని అకౌంట్‌లలో జమ చేయలేకపోయారు. పోలింగ్ ముగియడంతో డబ్బుల్ని లబ్ధిదారుల అకౌంట్‌లలోకి జమ చేశారు. నాలుగు రోజుల్లోనే రూ.5,868 కోట్లు నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత విడి విడిగా ఇప్పుడు లబ్ధిదారుల అకౌంట్‌లలోకి జమ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com