ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో భారీగా పెరిగిన చికెన్ ధరలు.. మూడు వారాల్లో అంత పెరిగిందా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 07:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత నెలలో కేజీ చికెన్ ధర రూ.230 నుంచి 260 వరకు ఉంది. మూడు వారాల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కేజీ చికెన్ రూ.300కు చేరింది.. ఈ రేటు ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు కోడిగుడ్ల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. మార్చిలో వంద గుడ్ల రేటు రూ.425 వరకు ఉంది.. ఏప్రిల్ రూ.20 తగ్గి రూ.405కు చేరింది. ఇప్పుడు ఉన్నట్టుండి గుడ్ల ధరలు అమాంతంపెరిగాయి.. 100 గుడ్లు రూ.550కి చేరింది. డజన్ గుడ్లు రిటైల్ మార్కెట్‌లో రూ.72కు చేరింది. ఇటు చికెన్, అటు కోడి గుడ్ల ధరలు పెరగడంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి కనిపిస్తోంది.


రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నెల నుంచి ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి పరిస్థితి మారిపోయింది.. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏకంగా 45 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఎండలు, వేడిగాలులతో కోళ్లు కూడా భారీగా చనిపోయాయి. అయినా సరే ఆ నెలలో కేజీ చికెన్ ధర రూ.230 నుంచి రూ.260 వరకు నడిచింది. ఇలా కోళ్లు చనిపోవడంతో ఫౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. ఏప్రిల్ నెల ఎండ దెబ్బకు కొత్త బ్యాచ్‌లను తీసుకురాలేదు. ఆ ప్రభావం చికెన్ రేటు పెరగడానికి కారణమైంది.


కోడి పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఏడు నుంచి తొమ్మిది వారాలకు సిద్ధమవుతాయి. ఈ క్రమంలో ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచ్‌లు లేకుండా పోయాయి. దీంతో డిమాండ్‌కు తగిన విధంగా మార్కెట్‌లో సప్లై లేకుండా పోయింది. అందుకే చికెన్ ధరలు భారీగా పెరిగాయని చెబుతున్నారు. చికెన్ ధరలు కేవలం 20 రోజుల్లోనే కేజీకి రూ.40 వరకు పెరిగింది. ఇప్పుడు కాస్త వర్షాలు పడి వాతావరణం చల్లగా మారడం.. వర్షాలు కొనసాగుతాయని చెప్పడంతో ఇఫ్పుడిప్పుడే మళ్లీ కొత్త బ్యాచ్‌లను తీసుకొస్తున్నారు పౌల్ట్రీ రైతులు. కనీసం నాలుడు వారాలు ఆగితే కానీ ధరలు తగ్గే పరిస్థితి ఉండదంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com